Sunday, September 23, 2007

గురు దక్షిణ

ఆనంద రావ్ పట్నాయక్ రాసిన కథల సంకలనమింది.


ప్రచురణకర్త మాటలలో చెప్పినట్లు మధ్య తరగతి జీవితాలలో నిత్యం జరిగే చిన్న చిన్న సంఘటనలతో అల్లిన కథలివి. అచ్చులో మహా అయితే రెండు పేజీలుంటాయి. 32 కథలున్న ఈ పుస్తకంలో అన్ని కథలు చదివిస్తాయి.


లంచాలు తీసుకోడం మానేయాలని ఓ ప్రభుత్వోద్యోగి ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఈ వ్యవస్థలో అది సాధ్యమేననుకున్నాడా?...తెలుసుకోవాలంటే 'అతని కంటే ఘనుడు ' కథ చదవాలి.

మందు కన్నా, వైద్యుడి హస్తవాసిపై విశ్వాసమే రోగాన్ని నయం చేయడంలో తోడ్పడుతుందని 'నమ్మకం ' కథ చెబుతుంది.

విషయ పరిజ్ఞానం లేని అధికారి ఓ రైతుకి వ్యవసాయంపై ఎలాంటి సూచనలు, సలహాలిచ్చాడు, వాటికి ఆ రైతు ప్రతిస్పందన ఏమిటో 'తోట ' కథ చెబుతుంది.

తన సొమ్ములో ఒక రూపాయి మిగుల్చుకుని, ఇతరుల డబ్బుతో తన కోరిక తీర్చుకోవాలనుకున్న చిద్విలాస్ కి ఎదురైన సంఘటన తెలుసుకోవాలనుకుంటే 'ఆశ ' కథ చదవాలి.

హోదా పెరగగానే, తన సహోద్యోగులపై అధికారులు ఎలా గొప్పలు పోతారో 'డాంబికం ' అనే కథలో చెప్పారు రచయిత.

మత ఛాందసుల బారి నుంచి ఓ పురాతన కళాఖండాన్ని ఓ క్యూరేటర్ కాపాడిన తీరుని 'రుబ్బురోలు ' కథలో చదవచ్చు.

ఇది రచయిత రెండో కథా సంపుటి. చిన్న చిన్న కథలు ఎన్నెన్నిఅల్లినా, వాటి ఇతివృత్తాలు విభిన్నంగా ఉండడంవల్ల ఈ 107పేజీల పుస్తకాన్ని హాయిగా ఏకబిగిన చదివేయచ్చు.

ఈ పుస్తకాన్ని 'జయంతి పబ్లికేషన్స్, హైదరాబాదు ' వారు జూలై 2007 లో ప్రచురించారు. ఈ పుస్తకం నవయుగ, నవోదయ, ప్రజాశక్తి వంటి అన్ని పుస్తకకేంద్రాలలోను దొరుకుతుంది. వెల 50 రూపాయలు.

0 comments: